TG DSC : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

డిగ్రీలో మార్కులు తక్కువ ఉన్న కారణంగా డీఎస్సీ రాసేందుకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2011కు ముందు డిగ్రీ పాసైన అభ్యర్థులు మార్కులతో సంబంధం లేకుండా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. డీఎస్సీ రాయాలంటే డిగ్రీల్లో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం తగ్గించింది.
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో నంబర్ 14ను రిలీజ్ చేశారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం.. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండిట్, పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు. ఈనెల 20 వరకు డీఎస్సీ దరఖాస్తుకు అవకాశం ఉండడంతో తక్కువ మార్కులున్న అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఇప్పటి వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కుల నిబంధన ఉండేది. భాషా పండితులు, పీఈటీలకు కనీస మార్కుల నిబంధన వర్తించదు. వారు డిగ్రీ పాసైతే సరిపోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com