Rains : ఈ సారి సాధారణం కంటే అధిక వర్షాలు: వాతావరణ శాఖ

నైరుతి రుతుపవనాల రాకతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కంటే ఎక్కువగా, వాయువ్య భారతంలో సాధారణం, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని IMD డైరెక్టర్ మృత్యుంజయ్ తెలిపారు. మరో ఐదు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు పేర్కొన్నారు.
గత సంవత్సరం నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. సరిపడిన వర్షపాతం లేక తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉండబోదని విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో మే 19వ తేదీన ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా కదులుతున్నాయని పేర్కొంది.
ఇక ఏపీలో రానున్న మూడు రోజులు ఎండ ప్రభావం చూపనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నేడు 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు 195 మండలాల్లో తీవ్ర వడగాలులు, 147 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com