Amrit Pal Singh : రేపు అమృత్ పాల్ సింగ్ ప్రమాణ స్వీకారం

ఖలిస్థానీ నేత, వారిస్ పంజాబ్ నాయ కుడు అమృత్ పాల్ సింగ్ ( Amrit Pal Singh ) ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని డిబ్రూగఢ్ జైల్లో ఉన్న అతడు.. జులై 5న లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఫరీద్ కోట ఎంపీ సరఖ్త్ సింగ్ ఖల్సా మీడియాకు వెల్లడించారు.
అమృత్ పాల్ సింగ్ ప్రమాణస్వీకారం గురించి తాను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో మాట్లాడానని ఖల్సా చెప్పారు. జులై 5న స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం ఉండనుందని తెలిపారు. దీనికి సంబంధించి అతడికి ఐదవ తేదీ నుంచి నాలుగు రోజులకు పేరోల్ లభించినట్లు చెప్పారు. అమృత్ పాల్.. పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ స్థానం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఉగ్రనిధుల కేసు నిందితుడు, బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ ప్రమాణ స్వీకారం కూడా అదే రోజు ఉండనుంది.
అమృత్ సర్ జిల్లా అన్నాలా పోలీసులపై దాడి కేసులో అమృత్ పాల్ సింగ్ పేరు దేశంలో మార్మోగింది. అతడు చాలాకాలం దుబాయిలో ఉన్నాడు. 'వారిస్ పంజాబ్ ' సంస్థ వ్యవస్థాపకుడు దీపి సిద్ధూ మరణంతో అమృత్ పాల్ సింగ్ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. నాటినుంచి ఖలిస్థానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబినే స్థావరంగా ఎంచుకున్నాడు. అజ్నాలా ఘటన తర్వాత దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో గడిపాడు. చివరికి రోడెవాల్లోని గురుద్వారాలో అతడిని అరెస్టు చేసి డిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com