Encounter : ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్

ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్లు సమాచారం. గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
మావోయిస్టు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్, ఎల్ ఎంజీ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు, పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు బీజాపూర్తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 34 మంది నక్సలైట్లు హతమయ్యారని పోలీసులు తెలిపారు. కాగా, బీజాపూర్ జిల్లా బస్తర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మొదటి దశ సాధారణ ఎన్నికలలో భాగంగా ఇక్కడ ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com