MP Jayant Sinha : ఎంపీ జయంత్ సిన్హాకు బీజేపీ షోకాజ్ నోటీసులు

MP Jayant Sinha : ఎంపీ జయంత్ సిన్హాకు బీజేపీ షోకాజ్ నోటీసులు
X

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హాకు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యవహారాలు, ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. సోమవారం జరిగిన ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జయంత్ సిన్హా ఓటు వేయలేదు. అయితే ఎంపీగా ఉండి కనీసం ఓటు కూడా వేయకపోవడంపై బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. నిన్న జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోలేదని ప్రశ్నించింది.

అయితే, ఝార్ఖండ్ హజారీబాగ్ ఎంపీ అభ్యర్థిత్వం తనకు దక్కనప్పటి నుంచి జయంత్ సిన్హా పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. "హజారీబాగ్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మనీశ్ జైస్వాల్‌ను ప్రకటించిన నాటి నుంచి జయంత్ సిన్హా పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారంపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. కనీసం ఓటు వేయాలని కూడా మీరు భావించలేదు. మీ ప్రవర్తనతో పార్టీ ప్రతిష్ట మసకబారింది’’ అంటూ ఝార్ఖండ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహు నోటీసులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంచితే, లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానంటూ మార్చిలో జయంత్ సిన్హా ట్వీట్ చేశారు. ఆ కొద్దిసేపటికే హజారిబాగ్ బీజేపీ అభ్యర్థిగా మనీశ్ జైస్వాల్ పేరుని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడే ఈ జయంత్ సిన్హా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే సీటు నుంచి ఆయన భారీ మెజారిటీతో గెలిచారు.

Tags

Next Story