EC Issues : ప్రసంగాల్లో నోరు జారొద్దు.. రాహుల్ కు ఈసీ హెచ్చరిక

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఈసీ (EC) కొన్ని సూచనలు చేసింది. ప్రచారంలో ప్రసంగాల పట్ల జాగ్రత్త వహించాలని కోరింది. గతంలో ప్రధాని మోడీపై దుశ్శకునం, జేబుదొంగ వంటి దూషణలు చేసిన నేపథ్యంలోఈసీ ఈ మేరకు సలహాను జారీచేసింది. ఆచితూచి మాట్లాడాలని, నైతిక ప్రవర్తనను అతిక్రమించొద్దని కోరింది. హైకోర్టు ఆదేశానుసారం, ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు, రాజకీయ నేతలకు ఇచ్చిన ఇటీవలి సూచనలను శ్రద్ధగా పాటించాలని ఈసీ కోరింది.
మార్చి1న జారీచేసిన సలహాలో, ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన పార్టీలు, అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. గతంలో నోటీసులు అందుకున్న వాళ్లు మరోసారి కోడు అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఈసీ రాహుల్ గాంధీకి నోటీసులు జారీచేసింది. రాజస్థాన్ లో జరిగిన ర్యాలీలో, ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని ప్రస్తావిస్తూ, మోడీని దుశ్శకునంగా ఎద్దేవా చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అదేవిధంగా బార్మర్ ర్యాలీలో జేబుదొంగ వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com