Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్కు ఏడోసారి ఈడీ సమన్లు

లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు (Arvind kejriwal) మరోసారి సమన్లు ఇచ్చింది ఈడీ. ఆయనకు ఈడీ సమన్లు పంపడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. గురువారం జారీ చేసిన ఈ సమన్లలోఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఇప్పటికి ఆరుసార్లు ఆయనకు ఈడీ సమన్లు పంపినప్పటికీ లెక్కచేయలేదు.
ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో.. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీల్లోనూ కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఐపీసీ సెక్షన్ 174 కింద కోర్టును ఈడీ ఆశ్రయించింది. ఉద్దేశపూర్వకంగానే సమన్లను ఆయన దాటవేస్తున్నారని న్యాయస్థానానికి తెలిపింది. పలు కారణాలతో ఈ విచారణను కోర్టు మార్చి 16కు వాయిదా వేసింది.
లోక్ సభ ఎన్నికలకు ముందు ఈడీ నోటీసులను ఆప్ తప్పుపడుతోంది. బీజేపీ ఉద్దేశపూర్వకంగా పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆడుతోందని ఫైరవుతున్నారు చీపురు పార్టీ నేతలు. కాగా,లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ.. కేజ్రీవాల్ను విచారించింది. గతేడాది ఏప్రిల్లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులోనూ సమన్లు అందాయి. ఇక, ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్సింగ్ జైల్లో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com