Constitution Day : ఏటా జూన్ 25న రాజ్యాంగ హత్యాదినం.. అమిత్ షా ప్రకటన

మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్'గా నిర్వహించాలని నిర్ణయించింది. 1975లో ఎమర్జెన్సీ కారణంగా అమానవీయ బాధలను భరించిన వారందరిని ఆ రోజున స్మరించుకోవాలని సూచించింది.
ఎమర్జెన్సీ విధించి ఇటీవలె 50ఏళ్లు పూర్తైన నేపథ్యంలో దీనికి సంబంధించిన గెజిట్ ను శుక్రవారం విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా పోస్ట్ పెట్టారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతృత్వ ధోరణిని ప్రదర్శించారు. దేశంపై ఎమర్జెన్సీని విధించడం ద్వారా మన ప్రజాస్వామ్య ఆత్మను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏ తప్పు చేయని లక్షలాది మందిని కటకటాల్లోకి నెట్టారు. మీడియా గొంతును మూయించారు అని అమిత్ షా చెప్పారు.
ఆనాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్య దివస్ మనకు గుర్తుచేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి దశ కారణంగా
నష్టపోయిన ప్రతి ఒక్కరినీ స్మరించుకునే రోజు అది అని పోస్ట్ పెట్టారు. ఎమర్జెన్సీ విధించిన రోజును రాజ్యాంగ హత్యాదినంగా నిర్వహించాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఇది మోడీ ప్రమోషనల్ స్టంట్ అని లైట్ తీసుకుంది. పదేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ విధించిన ప్రధాని మోదీని జూన్ 4న నైతికంగా ప్రజలు ఓడించారని, ఆ రోజు మోదీ ముక్త్ దివస్ గా చరిత్రలో నిలిచిపోతుందని ఎద్దేవా చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com