UP Road Accident : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్షహర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా 8 మంది అక్కడికక్కడే మరణించారు. 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం బులంద్షహర్-అలీగఢ్ సరిహద్దులోని అర్నియా బైపాస్ సమీపంలో తెల్లవారుజామున 2:10 గంటల ప్రాంతంలో జరిగింది. కాస్గంజ్ జిల్లాకు చెందిన 61 మంది భక్తులు రాజస్థాన్లోని గోగామేడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. క్రేన్ సహాయంతో బోల్తా పడిన ట్రాక్టర్ ట్రాలీని రోడ్డుపై నుంచి తొలగించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ ట్రక్కును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com