Rajasthan : మండుతున్న రాజస్థాన్.. 51 డిగ్రీలు క్రాస్

మనదగ్గర వాతావరణం చల్లగా ఉంది కానీ... ఉత్తర భారతదేశం సలసల కాగుతోంది. గత రెండు రోజులుగా ఠారెత్తిస్తున్న సూర్యుడు.. మరో 5 రోజులపాటు ఇదే ప్రభావం చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ఉత్తరాది 5 రాష్ట్రాల ప్రజలు రానున్న 5 రోజు లపాటు జాగ్రత్త వహించాలని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
రాజస్థాన్లో 51 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడి పలు పట్టణాల ప్రజలు బయటకు వచ్చేం దుకు జంకుతున్నారు. సాయంత్రం 7 గంటల వరకు వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే 1-5 రోజుల్లో వాయవ్య భారత దేశంలోని మైదానాలలో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ గఢ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, గుజరాత్ రాష్ట్రాలతోపాటు రాజస్థాన్లో కూడా వేడిగాలులు ఎక్కువగా వీస్తాయని తెలిపింది. పగటి వేళ బయటకు వెళ్లకుండా చిన్నారులు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com