Maharashtra: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతిచెందారు. ఛత్రపతి శంభాజీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో ఆలం అనే టైలరింగ్ షాపులో మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే షాపు పైన ఉన్న ఇండ్లకు మంటలు వ్యాపించడంతో అప్పటికే ఏడుగురు మరణించారు. వీరంతా దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ సంఘటనపై శంభాజీ నగర్ పోలీస్ కమీషనర్ మనోజ్ లోహియా మాట్లాడుతూ.. "ఉదయం 4 గంటల సమయంలో, ఛత్రపతి శంభాజీ నగర్లోని కంటోన్మెంట్ ప్రాంతంలోని ఒక బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. మంటలు రెండవ అంతస్తుకు వ్యాపించలేదు.. కానీ తరువాత ప్రాథమిక విచారణలో ఊపిరాడక ఏడుగురు చనిపోయారని తేలింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.ఈ ఘటనలో విచారణ జరుగుతోంది" అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com