Puja Khedkar : పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వం రద్దు.. డిబార్ చేసిన యూపీఎస్సీ

మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా భేడ్కర్ పై అవినీతి ఆరోపణల వ్యవహారంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె ప్రొవిజినల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అంతేగాక, భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది.
పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా భేడ్కర్ పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై యూపీఎస్సీ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ భేడ్కర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే, దీనికి ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చర్యలు తీసుకున్నారు.
జులై 25లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. కానీ, ఆమె ఆగస్టు 4 వరకు గడువు కావాలని కోరింది. ఇందుకు తిరస్కరించి.. జులై 30 వరకు అదనపు సమయం కల్పించారు. ఇదే చివరి అవకాశమని.. ఎలాంటి పొడిగింపులు ఉండవని స్పష్టంచేశాం. కానీ, ఆమె గడువులోగా తమ సమాధానాన్ని సమర్పించలేదు. అందువల్ల సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ -2022లో ఆమె ప్రొవిజినల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కమిషన్ నిర్వ హించే నియామక పరీక్షలు/ఎంపికలకు హాజరు కాకుండా శాశ్వతంగా డిబార్ చేస్తున్నామని యూపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com