Sixth Phase of Elections : ఆరో దశలో సంపన్న అభ్యర్థులు వీళ్లే!

Sixth Phase of Elections : ఆరో దశలో సంపన్న అభ్యర్థులు వీళ్లే!
X

దేశంలో ఆరో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రాల ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ దశలో మొత్తం 866 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 338 (39 శాతం) మంది కోటీశ్వరులని, వారి సగటు ఆస్తి విలువ రూ.6.21 కోట్లుగా ఉందని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదికలో తెలిపింది.

14 శాతం మంది అభ్యర్థులకు రూ.5 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయని, 13 శాతం మందికి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆస్తులు ఉన్నాయని వివరించింది. మరోవైపు 26 శాతం మంది ఆస్తుల విలువ రూ.10 లక్షల లోపేనని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. హర్యానాలో మొత్తం 223 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 102 మంది కోటీశ్వరులని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. ఢిల్లీలో 68 మంది, ఉత్తరప్రదేశ్‌లో 59 మంది, బీహార్ 35, జార్ఖండ్ 25, ఒడిశా నుంచి 28, పశ్చిమ బెంగాల్ నుంచి 21 మంది సంపన్న అభ్యర్థులు పోటీలో ఉన్నారని వివరించింది.

హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ రూ.1241 కోట్లతో ఈ దశలో పోటీ చేస్తున్నవారిలో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. నవీన్ జిందాల్‌కు కురుక్షేత్రలో గట్టి పోటీ ఇస్తున్న ఆప్ అభ్యర్థి సుశీల్ గుప్తా రూ.169 కోట్లతో మూడవ సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఒడిశాలోని కటక్‌ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సంత్రుప్త్ మిశ్రా రూ.482 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

Tags

Next Story