Akhilesh : ఎంపీగా కొనసాగుతా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : అఖిలేశ్
తాను ఎంపీగానే కొనసాగుతానని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ( Akhilesh Yadav ) అన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానని కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. కాగా 2022లో కర్హల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలేష్ యాదవ్.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి ఎంపీగా బరిలో దిగిన విషయం తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట అయిన కన్నౌజ్ నుంచి అఖిలేష్ భారీ మెజార్టీతో గెలుపొందారు.
కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం మెయిన్పురి జిల్లాలో ఉంది. అంతేగాక మెయిన్ లోక్సభ స్థానం పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కర్హాల్ ఒకటి. పైగా ఈ ఎన్నికల్లో మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్ మెయిన్పురి, కర్హాల్ నియోజకవర్గాల ప్రజలతో సమావేశమై తన నిర్ణయాన్ని వెల్లడించారు. అదే నిర్ణయాన్ని ఇవాళ ఎంపీల సమావేశంలో ప్రకటించారు.
ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగంగా, సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లలో 37 స్థానాలను గెలుచుకుని లోక్సభలో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్కు 6 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ 62, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక యూపీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అఖిలేష్ యాదవ్ స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీలో సీనియర్ నేతల్లో శివపాల్ యాదవ్ ను నియమించే అవకాశం ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com