T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ సమరానికి ఐదు రోజులే..

మరో ఐదు రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 2 నుంచి జరిగే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. ఐదేసి జట్ల చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్స్ సూపర్-8కు వెళ్తాయి. అక్కడ జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఇందులోనూ టాప్-2లో నిలిస్తే సెమీస్ చేరుతాయి. సెమీస్లో విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. తొలిసారి ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తున్న అమెరికా గడ్డపై 16 మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-ఏ మ్యాచ్లన్నింటికీ అమెరికానే ఆతిథ్యమిస్తుండగా, నాకౌట్ మ్యాచ్లు మొత్తం వెస్టిండీస్లో జరగనున్నాయి.
ఈ వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా జట్టు న్యూయార్క్ చేరుకుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ ముగియడంతో ఫైనల్ ఆడే భారత క్రికెటర్లు తప్ప మిగిలినవాళ్లంతా మే 25 శనివారమే అమెరికా ఫ్లైట్ ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా వీరు న్యూయార్క్లో ల్యాండ్ అయ్యారు. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్తోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, సిరాజ్లు న్యూయార్క్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘టచ్డౌన్ న్యూయార్క్’ అంటూ బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com