TS : సీఎం రేవంత్రెడ్డికి తన కుర్చీ మీద తనకే నమ్మకం లేదు : డీకే అరుణ
సీఎం రేవంత్రెడ్డికి తన కుర్చీ మీద తనకే నమ్మకం లేదని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆమె వికారాబాద్ జిల్లా కొడంౄగల్ నియోజకవర్గంలోని మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కొడంగల్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పూనంచంద్ లాహటి నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రేవంత్రెడ్డికి మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదని, అందుకే అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
పాలన చేతకాక ఓట్ల కోసం తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుర్తి పాలన తేవాలని రేవంత్ చూస్తున్నారని, ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థి కూడా కల్వకుర్తి వ్యక్తే అని చెప్పా రు. ఎన్నికల హామీలైన రైతుల రుణమాఫీ, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు నెలకు 2,500 ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జిల్లా వాసినని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి పాలమూరుకు చేసిందేమీ లేదని విమర్శించారు.
తాను గతంలో మంత్రిగా కొడంగల్ నియోజకవర్గంలో కళాశాలలు, విద్యుత్ సబ్స్టేషన్లు ఇలా ఎన్నో పనులకు ప్రారంభోత్సవాలు చేశానని, భీమా, నెట్టంపాడు ప్రాజెక్టుల కోసం నిరాహార దీక్షలు చేశానని గుర్తుచేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని చెప్పారు. బీజేపీకి ఓట్లేసి, మరోసారి మోదీని ప్రధానిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తన గెలుపును ఎవరూ ఆపలేరని ఆమె స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com