TS : మాధవీలతపై కేసు నమోదు

నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోక్ సభ సెగ్మెంట్ కు పోలింగ్ పూర్తయింది. ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలను నకాబ్ తీసి ముఖం చూపించాలని కోరి ఓటర్ ఐడీల వెరిఫికేషన్ చేశారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. అజాంపూర్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 122లో ఈ వెరిఫికేషన్ చేశారు.
దీంతో.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదైంది. ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాలతో మలక్పేట్ పీఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓటర్ల స్లిప్ లను పరిశీలించారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. మాధవీలత ఓటర్ ఐడీలు, స్లిప్ లను పరిశీలిస్తూ ఓటర్లను తనిఖీ చేస్తున్న వీడియో వెలుగుచూసింది.
ఓటర్ల ముఖాలను చూసి, వారిని గుర్తించిన తర్వాత ఓటింగ్ కు అనుమతించాలని మాధవీలత అధికారులతో వాగ్వాదానికి దిగడం వీడియోలో కనిపించింది. ఓటర్ స్లిప్ ల తనిఖీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com