Central Government : తెలంగాణకు కేంద్రం రూ.231.75 కోట్ల వరద సాయం

వరదలు, విపత్తు సాయం కింద తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులను విడుదల చేసింది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఏపీకి రూ. 608.08 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 231.75 కోట్లను కేంద్రం రిలీజ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో హై లెవెల్ (హెచ్ఎస్ సీ) మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో 2024లో వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడటం, తుపానులు సంభవించిన ఐదు రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సాయంపై చర్చించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) ద్వారా ఐదు రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు ఆర్థిక సాయం అందించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో ఏపీకి అత్యధికంగా రూ. 608.08 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, తెలంగాణకు రూ. 231.75 కోట్లు, నాగాలాండ్కు రూ.170.99 కోట్లు కేటాయించారు. కాగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) లో ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసిన నిధులకు అదనంగా ఈ ఆర్థిక సహాయం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతోషం వ్యక్తంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com