Good News for Farmers : పంట నష్టపోయిన రైతుకు గుడ్ న్యూస్

మార్చిలో వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంట నష్టం సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టం లెక్కలను వ్యవసాయ శాఖ తేల్చింది. మొత్తం 10 జిల్లాల్లో 15,246 మంది రైతులకు చెందిన 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు నిర్ధారించారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 10వేల చొప్పున పరిహారం అందిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది.
ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.15.81 కోట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించనుంది. రైతులకు పరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల సంఘం అనుమతితో త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్టు మంత్రి తుమ్మల కార్యాలయం తెలిపింది.
ప్రతిపక్షాల లెక్కలు వేరే ఉన్నాయి. 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక్కో ఎకరాకు కనీసం రూ.25వేలు ఇవ్వాలని కోరుతున్నాయి. ఐతే.. ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారం పంట సాయం అందిస్తామంటోంది. రుణమాఫీ పథకంపై బ్యాంకులు, సహకార సంఘాలు రైతులను ఇబ్బందులు పెట్టవద్దని ప్రభుత్వం కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com