KTR Tweet : సర్కారు సైట్లలో పదేళ్ల కంటెంట్ మిస్సింగ్.. కేటీఆర్ ట్వీట్

తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లతో పాటు పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ముఖ్యమైన సమాచారం కనిపించడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్.
2023 డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ లోని ముఖ్యమైన సమాచారాన్ని కనిపించకుండా చేశారని కేటీఆర్ అన్నారు. కొన్ని ముఖ్యమైన వెబ్ సైట్లను పూర్తిగా తొలగించారన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రారం భంలో మెయింటెనెన్స్ ఇష్యూ పేరిట ఆ ప్రముఖ సైట్లను ప్రజలకు దూరంగా ఉంచినట్లు తెలిపారు. కానీ ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా కనిపిస్తోందన్నారు. ఈ వెబ్ సైట్ల నుంచి ముఖ్యమైన సమాచారం ఆదృశ్యం కావడం, కొన్ని వెబ్ సైట్లు మాయం కావడం వెనుక పాలకుల హస్తం ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.
2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ ముఖ్య మంత్రిగా రాష్ట్రాన్ని పాలించారని... కేసీఆర్ పరిపాలనకు సంబంధించిన వేల ఫొటోలు, వీడియోలు, ముఖ్యమైన సమాచారాన్ని వెబ్ సైట్లతో పాటు సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి తొలగించారని తెలిపారు. ముఖ్యమైన కంటెంట్ ను ఆర్కైవ్స్ లో భద్రపరచాలి కానీ.. ఇలా తొలగించడం సరికాదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com