Bandi Sanjay : ఈడీ, సీబీఐ కేసులు ఉంటే బీజేపీలో చేర్చుకోం: బండి సంజయ్

ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలు బీజేపీలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కేంద్రమంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ) స్పష్టం చేశారు. అలాగే ఈడీ, సీబీఐ కేసులు ఉన్న నేతలను చేర్చుకునేది లేదన్నారు. ఎంపీ కేకేతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. రాజీనామా చేయిస్తే వచ్చే ఉపఎన్నికల్లో అన్ని సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు.
ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు, బీజేపీకి సంబంధమే లేదని నరేంద్రమోదీ ప్రభుత్వం అవినీతిపరులను ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. స్టేట్ ప్రెసిడెంట్ మార్పు, నూతన అధ్యక్షుడి ఎంపిక అంశం పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్నారు.
కొత్త నేతలకు అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదని, ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధమైన పరిస్థితులుంటాయని చెప్పారు. ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని అధ్యక్షుడిని చేయాలనే దానిపై అన్నీ ఆలోచించి జాతీయనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com