Kavitha : కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( Kavitha ) కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో జులై 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ముందు ఆమెను వర్చువల్గా సీబీఐ అధికారులు హాజరుపరిచారు.
ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఇటీవలే ములాఖత్ అయిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కవితను మంగళవారం వారు కలిశారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు మంజూరు చేసిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. నిన్న కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. ఇవాళ ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈక్రమంలోనే దీన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. కాసేపట్లో పూర్తి వాదనలు విననుంది. అనంతరం తుది తీర్పు వెలువరించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com