TG : యువకులకే పదవులు.. 15 ఏళ్లు పాలించబోతున్నామన్న కేసీఆర్

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తదని, మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటదని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని అన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అలాగే జరిగిందని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రంలోని బీఆర్ ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జడ్పీ చైర్మన్లు అందరూ రాష్ట్రం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని, విజయ వంతంగా పదవీకాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నప్పటికీ శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలని కేసీఆర్ అన్నారు.
పార్టీ నాయకులను సృష్టిస్తుంది కాని నాయకులు పార్టీని సృష్టించరని, మంచి యువ నాయకత్వాన్ని తయారు చేస్తామని చెప్పారు కేసీఆర్. తాము అధికారంలోకి వచ్చాక గతంలో వైఎస్ అమలు చేసిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను పేర్లు మార్చకుండా మరింత బాగా అమలు చేశామని గుర్తుచేశారు. రైతుబంధు పథకాన్ని అద్భుతంగా రైతులందరికీ అందించామనీ.. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రకరకాల కారణాలతో అసలు ఆ పథకానికే ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు గులాబీ బాస్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com