TS : కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన కేసీఆర్

లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
దీనికి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు. కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను పావులుగా వాడుకుంటోందని కేసీఆర్ ఆరోపించారు. ప్రజాస్వామ్యా నికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని ఓ ప్రకటన విడుదల చేశారు. లిక్కర్ స్కామ్ కేసు లో ఎమ్మెల్సీ కవితను వారం రోజుల కిందట అరెస్ట్ చేయగా, గురువారం ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుంది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది.. ఆమె బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లపైనా రైడ్స్ జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే కవిత భర్తకూ ఈడీ నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే కవిత, అనిల్ బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com