TS : కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత (Niveditha) పేరును కేసీఆర్ (KCR) ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత సాయన్న కుమార్తెను అభ్యర్థిగా ఎంపిక చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఈ స్థానంలో మే 13న ఉపఎన్నిక జరగనుంది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరిలో మరణించడంతో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ టికెట్ను సాయన్న బిడ్డ లాస్య నందితకు ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత 2024 ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఎన్నికలతో పాటు, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది.
ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే లాస్య చనిపోవడంతో ఆ కుటుంబంపై నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఈ నేపథ్యంలో సాయన్న కూతురు నివేదితకే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు కేసీఆర్కు నివేదిత కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తన తల్లి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తదితరులతో కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com