TS : లై డిటెక్టర్, నార్కో టెస్ట్కి నేను సిద్ధం: కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదన్న కేటీఆర్.. లై డిటెక్టర్, నార్కో టెస్ట్కైనా సిద్ధమన్నారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని సీఎం రేవంత్ చెప్పగలరా? ప్రతిపక్షాల ఫోన్లను కేంద్రం ట్యాప్ చేస్తోంది. కిషన్ రెడ్డి, రేవంత్లకు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకునే ధైర్యం ఉందా’ అని సవాల్ విసిరారు.
బీజేపీలో చేరుతారనే ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించడం లేదని కేటీఆర్ విమర్శించారు. ‘ఓటుకు నోటు కేసులో కేంద్రం విచారణ చేయొచ్చని రేవంత్ భయం. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ , చేవెళ్ల, ADB లాంటి స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు గెలిచేలా రేవంత్ చర్యలు కనిపిస్తున్నాయి. ఎలాగో బీజేపీలో చేరుతాను కాబట్టి.. నలుగురు బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించుకుందాం అనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లున్నారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర రాజకీయాలు మరో దశాబ్దం పాటు కేసీఆర్ చుట్టూనే తిరుగుతాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ’20 ఏళ్లుగా కేసీఆర్ చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. మా ప్రభుత్వంలో తెలంగాణను నం.1గా నిలబెట్టాం. అధికారంలో కొన్ని పొరపాట్లు చేశాం. సరిదిద్దుకుంటాం. రైతుబంధు, దళితబంధు, కార్యకర్తల విషయంలో పొరపాట్లు గుర్తించలేకపోయాం. స్వల్ప తేడాతోనే ఓడిపోయాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విజయం సాధిస్తాం’ అని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com