TS : కేసీఆర్కు కరెంట్ షాక్.. రేవంత్ మరో అస్త్రం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను (KCR) తీవ్రంగా ఇరుకునపెట్టేందుకు రేవంత్ (CM Revanth Reddy) అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ జెనరేషన్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ ఒప్పందాల్లో అవకతవకల్ని బయట పెట్టేందుకు ప్రభుత్వం నియమిచిన కమిటీ పని ప్రారంభించింది.
ప్రభుత్వం కాంపిటీటివ్ బిడ్డింగ్కు వెళ్లకుండా నామినేషన్ల ప్రాతిపదికన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఛత్తీస్గఢ్ డిస్కంల నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని ఇప్పటికే ప్రభుత్వం పలు సందర్భాల్లో ఆరోపించింది. న్యాయ విచారణ జరిపించేలా.. పాట్నా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని 'కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ'గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ ఇష్యూకు సంబంధించిన సమాచారం, సాక్ష్యాలు, ఆధారాలను ఎవరైనా కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. సంబంధం ఉందని కమిషన్ భావిస్తే మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులను కూడా విచారణకు పిలుస్తామని .. మొదట రిక్వెస్ట్ లెటర్స్ రాస్తామనీ, వాటికి స్పందించకుంటే సమన్లు పంపుతామని జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. మూడు ఒప్పందాలకు సంబంధించిన ఫైళ్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి, భవన నిర్మాణాల్లో అవినీతి.. ఇప్పడు విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి.. ఇలా ఒక్కొక్కటిగా విచారణను వేగవంతం చేస్తూ ముప్పేట దాడికి రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా పావులు కదుపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com