Budget Sessions : ఇవాళ్టితో ముగియనున్న బడ్జెట్ సమావేశాలు

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపిన శాసనసభలో ప్రభుత్వం శుక్రవారం కులగణన తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నది. తొలుత రూపొందించిన షెడ్యూలు ప్రకారం గురువారం సాయంత్రమే దీన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ బడ్జెట్ పై చర్చ సుదీర్ఘంగా జరగడంతో శుక్రవారానికి వాయిదాపడింది. రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టనున్నట్లు మంత్రివర్గం తీర్మానించడంతో దానికి సంబంధించిన తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టి చర్చల అనంతరం ఆమోదానికి వెళ్లనున్నది.
మరోవైపు సాగునీటిరంగంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, ఆర్థిక దుబారా, నిర్లక్ష్యం, నిర్మాణంలో అవకతవకలు తదితరాలకు సంబంధించి ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy) శ్వేతపత్రాన్ని సమర్పించనున్నారు. వీటిపై చర్చల అనంతరం సభ ఆమోదం తెలపనున్నది. ఇదిలా ఉండగా శాసనమండలి మాత్రం ఒక రోజు ముందే (గురువారమే) నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ (Governor Tamilsai Soundararajan) ప్రసంగంతో మొదలయ్యాయి.
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పబోమంటూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానంతోపాటు కాళేశ్వరంపై కాగ్ నివేదిక, మేడిగడ్డలో మంత్రుల సందర్శన తదితరాలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ వారం రోజుల వ్యవధిలో జరిగాయి. కులగణన తీర్మానానికి, సాగునీటిరంగంపై వైట్ పేపర్కు ఆమోదంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com