Surgery : 11 ఏళ్ల బాలికకు అరుదైన శస్త్రచికిత్స

11 ఏళ్ల బాలికకు గాంధీ ఆస్పత్రి చిన్నపిల్లల వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి కణితిని తొలగించారు. సోమవారం గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, చిన్నపిల్లల విభాగాధిపతి ప్రొఫెసర్ నాగార్జున వివరాలు వెల్లడించారు. నాందేడ్కు చెందిన 11 ఏళ్ల బాలిక సంధ్య కొన్ని నెలలుగా రక్తపోటు, తలనొప్పి మైకం, వాంతులు, నిత్యం చెమట రావడం తదితర సమస్యలతో బాధపడుతుంది.
బాలికను తల్లిదండ్రులు వారం రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో అడ్మిట్ చేశారు. ప్రొఫెసర్ నాగార్జున బాలికకు వైద్య పరీక్షలు చేసి ఆమెకు బైలేటరల్ అడ్రినల్ ఫియోక్రోమోసైటోమో అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. సుమారు ఐదు లక్షలమందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి ఉంటుందని తెలిపారు. కేసును సవాలుగా తీసుకున్న వైద్యులు శస్త్రచికిత్స చేసి చిన్నారి కడుపులో కుడి అడ్రినల్ సిరను కత్తిరించి లాపర్స్కోపికా నుంచి కణితిని విజయవంతంగా తొలగించారు.
ఈ శస్త్రచికిత్సలో పీడియాట్రిక్ వైద్యులు శ్రీనివాస్, అశ్రిత్రెడ్డి, మనోజ్రెడ్డి, హర్ష, ప్రొఫెసర్ ఆవుల మురళీధర్, పీడియాట్రిక్ అనస్థీషియా వైద్యులు పద్మావతి, పీడియాట్రిక్ హెచ్ఓడీ ప్రొఫెసర్ జార్జ్, అజయ్మోహన్, ఎండోక్రినలాజీ విభాగం ప్రొఫెసర్ విజయ్శేఖర్రెడ్డి, శ్రీనివాస్, జాస్మిన్, ఓటీ సిబ్బంది పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com