TS : పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తొలిరోజు ముగ్గురు నామినేషన్

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికకు నామినేషన్ల ఘట్టం మొదలైంది. ఈ ఎన్నికకు సంబంధించి నల్లగొండ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన గురువారం నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
స్వంతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు ఒక సెట్, ప్రజావాణి పార్టీ తరపున పాటి శ్రీకాంత్రెడ్డి ఒక సెట్, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి నందిపాటి జానయ్య ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈనెల 9వరకు నామినేషన్ల దాఖలుకు గడువుండగా.. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారన్నదానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. మూడు ఉమ్మడిజిల్లాల్లోని మొత్తం 12 జిల్లాల్లో 4,61,806 మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో పోటీకి ఆయా పార్టీల మద్దతు కోరుతూ కీలకనేతలు ప్రయత్నాలు చేస్తుండడంతో అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందనేని ఆసక్తిని రేపుతోంది.
ఈనెల 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. పదో తేదీన పరిశీలన జరగనుంది. 13న ఉపసంహరణకు చివరి రోజు. కాగా.. 27వ తేదీన ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత వచ్చే నెల 5వ తేదీన పట్టభద్రుల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నిర్వహించగనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com