TS : తెలంగాణలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి

తెలంగాణపై పిడుగుల వాన కురిసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులు బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో వర్షం ధాటికి జనజీవనం స్తంభించిపోయింది.. గ్రేటర్ హైదరాబాద్ నగరం తడిసిముద్దగామారింది. పలు మార్గాల్లో డ్రైనేజిలు పొంగిపొర్లి గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. సంగారెడ్డి పట్టణంలో దాదాపు అరగంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రంగారెడ్డి, వేములవాడ జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు చనిపోగా ఐదుగురికి గాయాలయ్యాయి. చాలాచోట్ల ధాన్యం తడిచిపోయి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారడంతో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని రక్షించుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com