TS : ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

TS : ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

ఈసారి ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60.53 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసిందని, ఇందుకు సరిపడా బీజీ–2 (బోల్‌గార్డ్‌–2) పత్తి విత్తనాలను ఈ నెలాఖరువరకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. 2021లో 60.53 లక్షల ఎకరాలున్న పత్తి పంట విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ 2023లో 45.17 లక్షల ఎకరాలకు చేరిందని తెలిపారు.

అయితే ప్రపంచ మార్కెట్లో పత్తికి పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని, ఈమేరకు బీజీ–2 విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గతేడాది 90 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అమ్ముడవగా ఈసారి 1.20 కోట్ల ప్యాకెట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీజీ–2 పత్తి విత్తన ప్యాకెట్‌ గరిష్ఠ ధరను రూ.864గా నిర్ణయించిందని, ఏ డీలరైనా దీనికన్నా ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అమ్మకాలను పర్యవేక్షిస్తూ నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను తుమ్మల ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో సీతారామా ప్రాజెక్ట్‌ ఏన్కూర్‌ లింక్‌ కెనాల్‌ పనులు శరవేగంగా పూర్తిచేయాలని పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఏన్కూరు వద్ద సీతారామ లింక్‌ కెనాల్‌ పనులను వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నాటికి పనులు పూర్తి చేసి, సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఈ కాల్వను ప్రారంభిస్తామన్నారు.

Tags

Next Story