Road Accident : విషాదం: కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తూ..ముగ్గురు స్పాట్

వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ను కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు సంగారెడ్డి వాసులు మరణించారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మల్లారెడ్డితో సహా జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరెడ్డి, భార్య విలాసిని మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరంతా వెంకటరామిరెడ్డి స్వగ్రామం న్యాల్కల్ మండలం మామిడ్గీ వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే వారణాసి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రమాద విషయాన్ని మృతుల కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదం గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మామిడ్గీ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. డ్రైవర్ మల్లారెడ్డి మల్గి నివాసి. మృతదేహాలను సంగారెడ్డి జిల్లాకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com