TDP-JSP-BJP: జనం కాదు ప్రభంజనం

TDP-JSP-BJP: జనం కాదు ప్రభంజనం
చిలకలూరిపేట సభకు ఇసుకేస్తే రాలనంత జనం.... మూడు పార్టీల శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌

పల్నాడు జిల్లా బొప్పూడిలోని సభా ప్రాంగణం జనసందోహంగా మారింది. తెలుగుదేశం-బీజేపీ -జనసేన ఉమ్మడి సభకు మూడు పార్టీల శ్రేణులు తరలివచ్చారు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు నుంచి వేల సంఖ్యలో వాహనాలు వచ్చాయి. పదేళ్ల తర్వాత.... తొలిసారిగా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రావడంతో అభిమానులు సందడి చేశారు. కోల్ కతా-చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు కిక్కిరిశాయి . దీంతో పోలీసులు ఆంక్షలు విధించారు. కేవలం సభకు వచ్చే వాహనాలను మాత్రమే గుంటూరు నుంచి చిలకలూరిపేట వెళ్లే మార్గంలో అనుమతించారు. ఆర్టీసీ, ప్రైవేట్, విద్యా సంస్థల బస్సులు, లారీలు, ట్రక్కులు కార్లు, ద్విచక్ర వాహనాల్లో ఉత్సాహంతో సభకు తరలివచ్చారు. జాతీయ రహదారి వెంట తెలుగుదేశం, జనసేన, భాజాపా జెండాలు పెక్సీలు శ్రేణులకు స్వాగతం పలికాయి.


శ్రీకాకుళం విజయనగరం మొదలుకొని ఉత్తరాంధ్ర కోస్తా ఆంధ్ర ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలలో మూడు పార్టీల నేతలు తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనంతో సభ కిక్కిరిసిపోయింది. తెలుగుదేశం-బీజేపీ-జనసేన ఆధ్వర్యంలో ‘ప్రజాగళం’ పేరిట బహిరంగ సభ నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఒకే వేదిక మీదకు వచ్చారు. ఈ నేపథ్యంలో మూడు పార్టీల శ్రేణుల్లో జోష్‌ నిండింది. చిలకలూరిపేట, వివిధ ప్రాంతాల నుంచి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు సభకు తరలివచ్చారు.


ప్రజల పాలిట, ప్రతిపక్షాల పాలిట రాక్షసుడిలా మారిన జగన్‌ను గద్దె దించడం కష్టమేమి కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో త్వరలో రామరాజ్యం స్థాపన జరుగబోతోందని వ్యాఖ్యానించారు. దేశాన్ని ప్రధాని డిజిటల్ రూపంలోకి తీసుకెళ్తుంటే ఏపీలో వైసీపీ పెద్దలు బ్లాక్ మనీ కూడబెడుతున్నారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆరోపించారు.మద్యం అమ్మకాలన్నీ నగదు రూపంలోనే జరుగుతున్నాయని ఇందులో పారదర్శకత లేదన్నారు. ఇసుక దోపిడి, ఇష్టారాజ్యంగా సాగుతోందని, ఏపీలో శాంతిభద్రతలు లేవని దుయ్యబట్టారు.ఏపీని గంజాయి రాజధానిగా మార్చారని ఆరోపించారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధం కోసం మోదీ పాంచజన్యం పూరిస్తారని.. ధర్మం, న్యాయం గెలుస్తుందని ప్రకటించారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి ఏపీ ప్రజలు ఆశీర్వాదం పలకాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story