AP: ఉద్ధృతంగా కార్మికుల ఉద్యమం

AP: ఉద్ధృతంగా కార్మికుల ఉద్యమం
సడలని సంకల్పంతో పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు... కలక్టరేట్ల ముట్టడికి యత్నం

ఆంధ్రప్రదేశ్‌లో డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వ అణచివేత ధోరణిని నిరసిస్తూ...ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హామీలు నెరవేర్చాలంటూ రోడ్డెక్కిన మున్సిపల్‌ కార్మికులు సడలని సంకల్పంతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కలెక్టరేట్ల వద్ద నినాదాలు చేశారు. పలు చోట్ల కలెక్టరేట్ల ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడం.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.


సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్‌ చేపట్టిన NTRజిల్లా మున్సిపల్ కార్మికులపై విజయవాడ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన వారిని ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. మహిళలు, పెద్ద వయసువారనే కనికరం లేకుండా... ఇష్టారాజ్యంగా లాక్కెళ్లారు. కార్మికులు, పోలీసుల మధ్య తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. ఈ క్రమంలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయారు. కాసేపు ఆమె చలనం లేకుండా ఉండిపోవడంతో..కార్మికులంతా తీవ్ర ఆందోళన చెందారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల చర్యల పట్ల మండిపడ్డ కార్మికులు..ఇచ్చిన హామీలను జగన్‌ నెరవేర్చేవరకూ పోరాటం ఆపబోమని తెగేసిచెప్పారు. హామీలు నెరవేర్చకపోగా... పోలీసులతో కొట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. బెదిరింపులకు పాల్పడి..ఇతరులతో పారిశుద్ధ్య పనులు చేయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో.. కలెక్టరేట్‌ వద్ద మున్సిపల్ కార్మికులు రోడ్డుపై బైఠాయించి.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరులో VRC నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన కార్మికులు.. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టిన కార్మికులు.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు 14 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుండటంతో.. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎక్కడికక్కడ వ్యర్థాలు రోడ్లపై గుట్టలుగా పేరుకుపోయాయి. భరించలేని దుర్గంధంతో స్థానికులు రోడ్లపైకి రావాలంటే హడలెత్తుతున్నారు.

గుంటూరు నగరపాలక సంస్థ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్న కార్మికులు గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. తెలుగుదేశం, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. ఏలూరులో మున్సిపల్ కార్మికులు జూట్‌ మిల్లు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. విశాఖలో GVMC గాంధీ పార్క్‌వద్ద.. శిరోముండనం కార్యక్రమం చేపట్టి... కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం కలెక్టరేట్‌ను ముట్టడించి... కార్మికుల చేతుల ఆకారంలో ఉన్న ప్లకార్డులు ధరించి డిమాండ్లను ప్రదర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story