Telugu States : ఆంధ్ర, తెలంగాణలో ధనికులైన అభ్యర్థులు వీళ్లే!
Wealthy Candidates Dominate Elections in Andhra Pradesh and Telanganaఎలక్షన్ నామినేషన్స్ అఫిడవిట్ లు చూసినప్పుడు లీడర్ల ఆస్తి పాస్తుల లెక్కలు తెలుస్తుంటాయి. అలా చూస్తే.. ఏపీ టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కనీసం రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉండి దేశంలోనే అత్యంత ధనవంతులైన ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. ఈసీ డేటా ప్రకారం.. పెమ్మసాని చంద్రశేఖర్ ఆదాయం 2022-23లో రూ.3.68 లక్షలు కాగా ఆయన జీవిత భాగస్వామి కోనేరు శ్రీరత్న ఆదాయం రూ. 1.47 లక్షలుగా ఉంది. పెమ్మసాని చరాస్తుల విలువ రూ. 2,316.54 కోట్లు. అతని భార్య చరాస్తుల విలువ రూ. 2,289.35 కోట్లు.
పెమ్మసానికి చాలా వరకు టెక్సాస్, హైదరాబాద్లో స్థిరాస్తులు ఉన్నాయి. పెమ్మసాని అమెరికాలోని జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్లో డిపాజిట్లు కలిగి ఉన్నారు. పెమ్మసాని, ఆయన భార్య కోనేరు శ్రీరత్న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 101 కంపెనీలలో ఉమ్మడి వాటాలను కలిగి ఉన్నారు. రూ.2.1 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, రెండు బెంజ్ కార్లు, టెస్లా ఎక్స్ కూడా ఉన్నాయి.
మరోవైపు.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున విశ్వేశ్వర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో తనకు సొంత కారులేదని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పడం విశేషం. విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో రూ. 4,568 కోట్లకు పైగా విలువైన చర, స్థిరాస్తులతో సహా ఇతర ఆస్తులను చూపారు. అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, PCR ఇన్వెస్ట్మెంట్స్, సిటాడెల్ రీసెర్చ్, సాఫ్రాన్ సొల్యూషన్స్ తో పాటు ఇతర వ్యాపారాలలో ఆయన ఆస్తులలో ఎక్కువ భాగం అతని జీవిత భాగస్వామి సంగీతా రెడ్డి పేరిట ఉన్నాయి. వీరిద్దరి వజ్రాలు, బంగారం ఆస్తుల విలువ రూ.11 కోట్లు. చేవెళ్ల, రాజేంద్రనగర్, చిత్తూరులో వ్యవసాయ భూములు, పుప్పాలగూడలో రెండు విల్లాలు ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com