ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 8వ తేదీన మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. అమరావతి సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో ఆ రోజు ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే 11 గంటల 49 నిమిషాలకు జగన్ కేబినెట్ తొలి సమావేశం అవుతుంది.
అయితే.. కేబినెట్లోకి ఎంతమందిని తీసుకుంటారు, ఎవరెవరిని తీసుకుంటారనేది సస్పెన్స్గా మారింది. అటు ఆశావహులు సంఖ్య కూడా భారీగా ఉంది. అయితే…. పార్టీ పెట్టిన నాటి నుంచి జగన్ వెంటే ఉన్న నేతలకు పదవులు దక్కే అవకాశం ఉందంటున్నారు వైసీపీ శ్రేణులు. మంగళగిరి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. భీమవరంలో గెలిచిన గ్రంథి శ్రీనివాస్కు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. వీరు కాకుండా బొత్స, ధర్మాన ప్రసాదరావు, ఆనం రాంనారాయణరెడ్డి, బాలినేని శ్రీనివాస్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, అనంత వెంకట్రామిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీకాంత్రెడ్డి తదితరులకు మంత్రిపదవులు దక్కే ఛాన్స్ ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. వీరితో పాటు గుడివాడ అమర్నాథ్, కోలగొట్ల వీరభద్రస్వామి, అవంతి శ్రీనివాస్ కూడా మంత్రిపదవులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ కోటాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, ఆళ్లనానికి మంత్రి వర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. పేర్ని నాని, సామినేని ఉదయభాను, పార్థసారథి, అంబటి రాంబాబులు మంత్రి పదవులు ఆశిస్తున్నారు.