AP : జనసేనకు బిగ్ రిలీఫ్.. గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

Update: 2024-04-29 06:55 GMT

జనసేనకు గాజు గ్లాసును కామన్ గుర్తుగా కేటాయిస్తూ ఈసీ ఆదేశాలతో ఆ పార్టీకి బిగ్ రిలీఫ్ లభించింది. దీంతో రాష్ట్రంలో జనసేన పోటీ చేయని చోట్ల ఇతరులకు ఈ గుర్తు కేటాయించే అవకాశం ఉండదు. జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును తమకు కేటాయించాలని కొందరు ఈసీని కోరారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ఈసీకి జనసేన లేఖ రాయగా.. అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది.

మరోవైపు జనసేన తరఫున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత యాక్టర్ పృథ్వీ వెల్లడించారు. మే 5 నుంచి 11 వరకు జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో చిరంజీవి పాల్గొంటారని తెలిపారు. కూటమి అభ్యర్థులు గెలవాలని, షూటింగ్ పక్కన పెట్టి ప్రచారం చేస్తారన్నారు. ఇప్పటికే మెగాస్టార్ పలువురు కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏపీలో ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీయే కూటమి రేపు విడుదల చేయనుంది. వైసీపీ మేనిఫెస్టో ఇప్పటికే విడుదలైంది. టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం పేర్లతో చూచాయగా తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ప్రధానంగా పెన్షన్‌పై కూటమి దృష్టి పెడుతున్నట్లు సమాచారం. క్రమంగా పెన్షన్‌ను పెంచుకుంటూ వెళ్తామని వైసీపీ అంటుండగా.. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రూ.4 వేల పెన్షన్ ఇస్తామని కూటమి హామీ ఇస్తోంది.

Tags:    

Similar News