టీడీపీ కార్యకర్తలపై దాడులు దురదృష్టకరమని.. అయినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని చంద్రబాబు అన్నారు. ఇవాళ ఉండవల్లి నివాసంలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులను ఖండిస్తూ తీర్మానం చేశారు. కార్యకర్తల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలని నిర్ణయించారు. 15న జరిగే పార్టీ వర్క్షాప్ లో దీనికి సంబంధించి కార్యచరణ సిద్దం చేయాలని నిర్ణయించారు.
రేపు ఉదయం అసెంబ్లీ సమావేశాలకు కలిసివెళ్లాలని నిర్ణయించారు. వెంకటపాలెం వద్ద ఎన్టీయార్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లనున్నారు. ప్రతిపక్షంగానే నాయకుల సమర్ధత తెలుస్తుందని.. ఎమ్మెల్యేలంతా కేడర్ కు మనోధైర్యం ఇచ్చేలా సమర్ధవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలని చంద్రబాబు సూచించారు. సమస్యల పోరాటంలో చిత్తశుద్ది చూపుతూ, సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. నియోజకవర్గాల్లో అప్రమత్తంగా ఉండి.. ఏం జరిగిన పార్టీ దృష్టికి తీసుకరావాలన్నారు.
శాసనసభ వేదికగా ప్రజల హక్కులపై పోరాటం కొనసాగిద్దామని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. టీడీపీకి ఎత్తుపల్లాలు కొత్తకాదని.. ఎన్టీయార్ హయంలోనూ తర్వాత అపజయాలు చవిచూసినా.. 37 ఏళ్లలో పార్టీ తన నిబద్దత విషయంలో రాజీపడలేదన్నారు. బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిద్దామన్నారు.