ప్రత్యేకహోదా ఉద్యమకారులపై అన్ని కేసులు ఎత్తేయాలని ఏపీ సీఎం జగన్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారుల నుంచి కింది స్థాయి వరకు అంతా శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలేకాదు.. ప్రతి ఉద్యోగి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు.
రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన జగన్.. ఏపీలో ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండాలి అన్నారు. పోలీసులపై పనిభారం తగ్గించేందుకు వీక్లీ ఆఫ్లు ఇస్తున్నామని ప్రకటించారు. దేశంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉండాలి అన్నారు. తప్పు చేస్తే ఎవరైనా.. ఎంతటివారైనా సహించవద్దున్నారు. గత పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలకు మన కళ్లతో చూశాం.. ఇకపై అలాంటి వాటికి మన ప్రభుత్వంలో తావు ఉండకూడదన్నారు జగన్.