హైదరాబాద్లో ఉంటున్న ఓ యువతి... నిర్మల్ జిల్లాలోని తన స్వగ్రామం కడెంకు బయలుదేరింది. నిర్మల్ చేరుకునే వరకే ఆలస్యం కావడంతో అప్పటికే బస్సులన్నీ వెళ్లిపోయాయి. దీంతో చేసేదేమి లేక బస్టాండ్లో ఒంటరిగా ఎదురుచూస్తోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ హెబ్నేజర్... యువతి దగ్గరకు వెళ్లాడు. ఆమెతో మాట కలిపాడు. ఇక్కడ ఉండడం మంచికాదు తనతో వస్తే ఇంట్లో ఆశ్రయం ఇస్తానని మాయమాటలు చెప్పాడు. సదరు కానిస్టేబుల్ మాటలు నమ్మిన యువతి అతనితో వెళ్లింది. అయితే కానిస్టేబుల్ యువతిని ఇంటికి తీసుకెళ్లకుండా.. ఓ లాడ్జీకి తీసుకెళ్లడం వివాదంగా మారింది.
ఇదంతా గమనించిన స్థానిక యువకులు జరిగిన తతంగాన్నంతా మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. లాడ్జీలో ఉన్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వీడియోలతో సహా జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల ప్రకారం కానిస్టేబుల్ హెబ్నేజర్తో పాటు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు.
నిర్మల్లో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులు ఉద్దేశ్యపూర్వకంగానే కానిస్టేబుల్ను ఇందులో ఇరికించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా ఇందులో కుట్రం కోణం ఉందా? కావాలనే మహిళను కానిస్టేబుల్ ట్రాప్ చేశాడా? అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని..ఇందులో కానిస్టేబుల్ తప్పుందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చెబుతున్నారు.