తెలుగు రాష్ట్రాల్లో విద్యా కుసుమాలు రాలిపోతున్నాయి.. వేధింపులు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి.. ఒత్తిడి తట్టుకోలేక, వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కంది ఐఐటీ-హైదరాబాద్ క్యాంపస్లో విషాదం చోటుచేసుకుంది. మాస్టర్ ఆఫ్ డిజైన్ సెకెండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి చెందిన మార్క్ ఆండ్రూ చార్లెస్గా గుర్తించారు. విద్యార్థి మృతితో సంగారెడ్డి సమీపంలోని కంది ఐఐటీ ప్రాంగణం దగ్గర విషాద ఛాయలు అలముకున్నాయి. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.. ఇప్పటికే సుసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. చనిపోయిన ముదు అతడి డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తన ఆత్మహత్యకు ఎవరూ కారకులు కాదంటూ చార్లెస్ రాశాడంటున్నారు.
విజయవాడ కానూరులో నీట్ కోచింగ్ తీసుకుంటున్న కార్తీక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వికాస్ మెడికల్ అకాడమీలో లాంగ్ టర్మ్ కోచింగ్ చేరిన కార్తీక్ కడప జిల్లా రాయచోటికి చెందినవాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో మెడికో ఆత్మహత్యకు యత్నించింది. పౌజ్య అనే విద్యార్థిని తరగతి గదిలోనే ఆత్మహత్యయత్నం చేసుకుంది. హాస్టల్ సిబ్బంది వేధింపులతో ఆమె బలవన్మరణానికి ప్రయత్నించింది. హాస్టల్ సిబ్బంది వేధింపులకు గురిచేస్తుండడంతో మనస్థాపానికి లోనైందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. హుటాహుటిన పౌజ్యను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ వరుస ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి.