మాజీ భార్యను హతమార్చాలని ప్లాన్ వేసిన భర్త.. పోలీసుల కళ్లుగప్పి పరార్!
విడాకులు తీసుకున్న మాజీ భార్యను హతమార్చాలని ప్లాన్ వేశాడు భర్త. ఈ ఘటన హైదరాబాద్లో తీవ్ర కలకలం రేపింది. అయితే తనపై దాడి చేస్తాడన్న విషయాన్ని ముందే పసిగట్టిన మాజీ భార్య పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు సాయికిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని బండ్లగూడ యడవమిత్ర కాలనిలోని బోరాబండలో సాయికిరణ్, లావణ్య దంపతులు ఇద్దరి పిల్లలతో కలిసి నివాసం ఉండేవారు. అయితే వారి సంసారంలో కొట్లాటలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి లావణ్య అదే ఏరియాలో పిల్లలతో కలిసి వేరేగా ఉంటూ.. ప్రైవేట్ కొలువు చేసుకుంటూ బతుకుతుంది. అయితే లావణ్యను కొంతకాలంగా వేధించడం మొదలు పెట్టాడు. ఎలాగైనా ఆమెను మట్టు బెట్టాలని పథకం పన్నాడు సాయికిరణ్. మద్యం తాగి.. ఓ కత్తితో రాజేంద్రనగర్ చేరుకున్నాడు. అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు.
అయితే అయితే పోలీసులు నిందితుడిని స్టేషన్ బయటే కూర్చోబెట్టడంతో నిందితుడు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. సాయంత్రానికి అతను ఫిలింనగర్లో కనిపించగా.. పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. మాజీ భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని, తమకు తమ కుటుంబానికి రక్షణ కావాలని బాధితురాలు కోరుతుంది.