రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి 200 రూపాయలు ఉన్న పింఛన్ ను వెయ్యి రూపాయలకు పెంచామన్న కేటీఆర్.. ఇప్పుడు వెయ్యిని రెండు వేల రూపాయలకు పెంచి ఇస్తున్నామని అన్నారు. పింఛన్ వయస్సును 57 ఏళ్లకు తగ్గించటంతో 7 లక్షల మంది లబ్ధి పొందుతారని అన్నారు.
పేదలపై పైసా భారం పడకుండా అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను ఇచ్చి తీరుతామని కేటీఆర్ చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై నమ్మకం లేనివారికి తానే బస్ ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణాలు చూపిస్తానంటూ కౌంటర్ ఇచ్చారు.
కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఈటల రాజేందర్ వేములవాడ మండలం తుర్కసిపల్లిలో 40 డబుల్బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మిడ్ మానేరు నుంచి రాజన్నగుడి చెరువులోకి లిఫ్ట్ డ్రైరన్ ప్రారంభించారు. కాళేశ్వరం నీటితో కరువును జయించి వేములవాడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఈటల అన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇళ్లను అందించడం సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పం అని కొనియాడారు.
సిద్దిపేటలో మాజీ మంత్రి, టీఆర్ఎస్ కీలక నేత హరీష్రావు ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెన్షన్ 2వేలకు పెంచి పేదల గుండెల్లో కేసీఆర్ ఒక ఆసరాగా నిలిచారని అన్నారు.. ఎన్నికల కోడ్ ఆకరణంగా పెన్షన్ల పంపిణీ ఆలస్యమైందని చెప్పారు. త్వరలోనే పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కల సాకారం చేస్తామని హరీష్రావు తెలిపారు. ఇక పెన్షన్లు పొందినవారందరికీ హరీష్రావు ఒక సూచన చేశారు.. చెట్లు కన్నతల్లి లాంటివని.. ఒక్కొక్కరూ ఒక మొక్కను నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.