పేదలమీద పడ్డ వైసీపీ నేతలు.. గుడిసెలు కూల్చి..

Update: 2019-08-23 11:03 GMT

ఇన్నాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు, టీడీపీ నేతలు కార్యకర్తలపై దౌర్జన్యాలు, దాడులు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు పేదలమీద పడ్డారు. గుడిసెలను కూల్చి ఇంట్లో ఉన్న సామాన్లు బయటపడేశారు. పోలీసుల సహాయంతో అడ్డొచ్చినవాళ్లను లాగిపడేశారు.

పేదలను అన్యాయంగా రోడ్డుపాలు చేసిన ఈ ఘటన కడప నగరంలో జరిగింది. ఆర్ట్స్‌ కాలేజి ఎదుట ఉన్న NTR నగర్‌లోని సర్వే నంబర్‌ 910లో రోజువారి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు తాత్కాలిక గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు వీరిపై స్థానిక వైసీపీ నేతలు ప్రతాపం చూపించారు.

8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమి ఇది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని ఈ నిరుపేదలు ప్రభుత్వానికి చాలా సార్లు మొరపెట్టుకున్నారు. ఈ భూమిపై తనకే హక్కులున్నాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కోర్టుకెక్కాడు. ఈ వ్యవహారం నడుస్తుండగానే భూమి తమదేనంటూ వైసీపీ నేతలు పేదలపై విరుచుకుపడ్డారు. పేదల్ని గుడిసెల్లోంచి బయటికి ఈడ్చేశారు.

కలెక్టరేట్‌ పక్కనే ఉన్న ఈ భూమిపై అధికార పార్టీ పెద్దల కన్నుపడింది. మరుక్షణమే ఇలా గద్దాల్లా వాలిపోయి రణరంగం సృష్టించి పేదలపై ప్రతాపం చూపించారు. పిల్లలు, ఆడవాళ్లు, ముసలోళ్లు అనే కనీస కనికరం లేకుండా జులుం ప్రదర్శించారు. ఈ తతంగాన్ని స్థానిక పోలీసులు దగ్గరుండి మరీ పూర్తి చేశారు. వైసీపీ నేతల దౌర్జన్యంపై పేదలు మండిపడుతున్నారు.

Similar News