అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువ రైతులు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొట్టిపాడు గ్రామానికి చెందిన వీరన్న, భాగ్యమ్మలకు ముగ్గురు సంతానం. ఏడాది క్రితం 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. పక్కనే ఉన్న HNSS కాలువ నుంచి పొలానికి మోటార్ బిగించే క్రమంలో చంద్రన్న, వీరన్నలు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు.. కొడుకుల మృతదేహాలను చూసి భోరున విలపించారు.