కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉపాధిహామీ పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రిని లేఖలో కోరారు. 2014-2019 మధ్య ఉపాధి హామీ పథకాన్ని ఏపీ సమర్థంగా నిర్వహించి.. దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చంద్రబాబు గుర్తు చేశారు. పెండింగ్ బిల్లులకు సంబంధించి కేంద్రం 1845 కోట్లు విడుదల చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా జోడించి విడుదల చేయకపోవడాన్ని లేఖలో తప్పుబట్టారు టీడీపీ అధినేత.
ఉపాధి హామీ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని లేఖలో పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా నిధులు మళ్లించడాన్ని తప్పుపట్టిన చంద్రబాబు.. ఈ చర్యలు ఉపాధి హామీ పథకం అమలు స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని అన్నారు. పెండింగ్ బిల్లులపై అనేక కుటుంబాలు ఆధారపడినందునా.. తక్షణమే నిధుల విడుదలకు చొరవ చూపాలని కోరారు చంద్రబాబు.