ఓవైపు పండగ.. మరోవైపు ఆర్టీసీ సమ్మెతో అన్ని దారులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వైపే.. పండగకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వేస్టేషన్ కిక్కిరిసిపోయింది. కాలు పెట్టలేని విధంగా ప్రయాణికుల రద్దీ నెలకొంది. చాలీ చాలని రైళ్లు, ఒకటో రెండో జనరల్ బోగీలు ఉండడంతో ప్రయాణికుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు సీట్ల కోసం పోటీ పడ్డారు. దీంతో తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు.. లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూలైన్లో ఒక్కొక్కరిని రైలు ఎక్కించే ప్రయత్నాలు చేశారు. ట్రైన్లలో కాలు పెట్టే చోటు లేకపోవడంతో కొంత మంది ప్రయాణికులు ఊసూరుమంటూ వెనుదిరిగారు. ఆర్టీ సీమ్మె, పండగ నేపథ్యంలో ప్రయాణికులు తమ గమ్య స్థానం చేరడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.