అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ప్రస్తుతం పదివేల లోపు డిపాజిట్లు చేసిన వారికి చెక్కులు పంపిణీ చేసినట్టు సీఎం తెలిపారు. త్వరలో 20 వేల డిపాజిట్ల బాధితులకు చెక్కులిస్తామన్నారు. తొలివిడతగా 264 కోట్లరూపాయలు కేటాయించామన్నారు. విపక్షంలో ఉన్నపుడు అగ్రి గోల్డ్ బాధితుల కోసం
పోరాడామన్నారు.
వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా అన్నదాతలకు సాయం చేస్తున్నామన్నారు సీఎం జగన్. పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా 8 వందల కోట్లు ఆదాచేశామన్నారు సీఎం.
అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలిచ్చామన్నారు సీఎం జగన్. గత 5 నెలల్లో... ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల వివరాలను జగన్ తెలిపారు. 2 లక్షల 25 వేల మంది ఆటో డ్రైవర్లకు వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా ప్రయోజనం కల్పిస్తున్నామన్నారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రయివేటు రంగంలో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు 75 శాతం రిజర్వేషన్ల చట్టం తెచ్చామన్నారు. అవినీతి రహితంగా పాలన సాగిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.