ఒకటి రెండు కాదు.. ఎనిమిది గంటల పాటు ప్రాణాలు అరచేత పట్టుకొని పోరాడాడు. కాచిగూడ రైల్ ప్రమాదంలో MMTS లోకో పైలట్ చంద్రశేఖర్ తీవ్ర ఆవేదన అనుభవించాడు. ఉదయం పదిన్నర గంటల సమయంలో ప్రమాదం జరగడంతో ఇంజన్లో పూర్తిగా ఇరుక్కుపోయాడు చంద్రశేఖర్. అప్పటి నుంచి అతణ్ని బయటకు తీసేందుకు రెస్యూ టీమ్స్ చాలా శ్రమించాయి. మొదట చేతులు బయటకు వచ్చినా.. తీయడానికి చాలా ఇబ్బందిగా మారింది. దీంతో అతడికి ఆక్సిజన్ అందించి.. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా చేశారు. చివరకు సాయంత్రం 6.30 గంటల సమయంలో క్షేమంగా బయటకు తీయగలిగారు. క్షేమంగా చంద్రశేఖర్ బయటపడ్డా.. అతడి చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
లోకో పైలెట్ క్షేమంగా బయటపడ్డా ఈ ప్రమాదానికి కారణాలు ఏంటన్నిది ఇంకా తెలియలేదు. ప్రమాదానికి కారణాలపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పని చేయలేదా..? లోకో పైలెట్ల మధ్య సమన్వయ లోపమే కారణమా..? అన్న దానిపై విచారణ చేస్తున్నారు. ఇంజన్లో ఇరుక్కు పోయిన లోకో పైలెట్ బయకు రావడంతో ఇప్పుడు అతడు చెప్పే సమాధానమే ఈ విచారణలో కీలకం కానుంది..
అధికారుల వెర్షన్ ఎలా ఉన్నా.. సిగ్నలింగ్ వ్యవస్థ లోపంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లింగపల్లి నుంచి ఫలకనూమా వెళ్తున్న mmts.. మరో ఫ్లాట్ఫాంపై ఉన్న హంద్రీ ఎక్స్ప్రెస్కు ఒకేసారి సిగ్నల్ ఇవ్వడంతోనే ప్రమాదం జరిగింది అంటున్నారు.. రెండు రైళ్ల ఇంజన్లు ఒకదానికి ఒకటి బలంగా ఢీ కొనడంతో.. ఈ ఘటనలో 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మూడు బోగీలు పక్కకు ఒరిగాయి.. పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది..
మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకుని ప్రమదానికి గల కారణాలపై ఆరా తీశారు.. ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు.. మంత్రి తలసాని యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని.. ప్రమాదంపై ఆరా తీశారు. ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం అన్నారు.. క్షతగాత్రుల బంధువులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు తలసాని.